కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం పేద ప్రజల రక్షగా నిలుస్తోందని.. అర్హులైన ప్రతిఒక్కరికీ 100 శాతం సంక్షేమం అందుతుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఎన్జీవో హోం రామ సోసైటీ-1 సచివాలయం పరిధిలోని 13, 15 వార్డులకు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న 650 మందికి సంబంధిత పత్రాలను హోంమంత్రి అందజేశారు. సర్టిఫికేట్ సేవలు కాకుండా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి కోరారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి.. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అర్హులై ఉండి ఏదైనా సంక్షేమం అందకుండా ఉంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందనన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లు మీ ఇంటికే తలుపు తట్టి ఇస్తున్నామని.. అలాగే ప్రతి ప్రభుత్వ సంక్షేమం పథకం కూడా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్న రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండేదని గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తీసుకోచ్చిన వినూత్న సంస్కరణల ద్వారా ప్రజలకు నేరుగా ఇంటి ముంగిటే సేవలు అందుతున్నాయన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 99 శాతం మంది అర్హులకు పథకాలు అందుతున్నాయని, మిగిలిన ఒక్క శాతం అర్హులను కూడా జల్లెడ పట్టి మరీ వెతికి జగనన్న సురక్ష పథకం ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News