Breaking News

జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక : సీఎం చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్-1 పరిధిలోని ఆరు జిల్లాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ ను తీసుకున్న సీఎం.. జిల్లాస్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటకాభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకోని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలో కాస్మోపాలిటిన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అదేవిధంగా అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో కూడా అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు.

కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు, జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో పనిచేసేవారికి వసతి సమస్య రాకుండా ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్

తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. విశాఖ తర్వాత అనకాపల్లి, అల్లూరి జిల్లాలు నిలుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో బాగా వెనకబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

వీఎంఆర్డీఏలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను సూచించారు. లక్ష మంది పారిశ్రామిక వేత్తలు, వన్ ఫ్యామిలి-వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. విశాఖలో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం వీఎంఆర్డీఏ భవనాలను సిద్ధం చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ చెప్పడంతో వచ్చేనెలలో ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విశాఖ నగరానికి కావాల్సిన కూరగాయలు అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి పంపేలా కలెక్టర్లు ప్రణాళిక రచించాలని సీఎం సూచించారు. అదేవిధంగా అల్లూరి జిల్లాలో ఆదివాసీలకు సమస్యగా మారిన ఆధార్ కార్డులను త్వరలో పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్ష మంది గిరిజనులు, 35 వేల మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేని విషయాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు వెంటనే వారికి ఆధార్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

Smooth Online Filing and Tax Payment for Tomorrow and Day After

vijayawada, neti patrika prajavarta: The Chief Commissioner of Commercial Taxes (CCST) would like to inform …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *