-అర్ధవంతమైన చర్చల కోసం పలు మార్పుల్ని సూచించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
-ఈ మార్పుల ఆధారంగా తదుపరి డిఆర్సి సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించిన మంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విస్తృత ప్రయోజనాల కోసం ఉద్దేశించిన జిల్లా సమీక్షా సంఘాల (DRC-District Review Committees) నిర్వహణలో సంస్కరణలు అవసరమని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నొక్కి వక్కాణించారు. ఈ మేరకు ఆయన పలు మార్పుల్ని సూచించారు. ఈ మార్పుల ఆధారంగా తదుపరి డిఆర్సి సమావేశాల్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశాను జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. జిల్లాల అభివృద్ధికి, ఆయా రంగాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిఆర్సిలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మరియు జిల్లా కమిటీ అధ్యక్షులు రెండు డిఆర్సి సమావేశాలకు నేతృత్వం వహించిన అనుభవంతో మంత్రి పలు సంస్కరణలు సూచించారు. శనివారంనాడు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఖిల్లాలో జరిగిన డిఆర్సి సమావేశం మొత్తం సమయం గతంలో జరిగిన మొదటి సమావేశంలో డిఆర్సి సభ్యులు లేవనెత్తిన 113 అంశాలపై జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల సమీక్షకే సరిపోవడంతో మంత్రి ఈ మార్పుల్ని సూచించారు. మొదటి సమావేశంలో సభ్యులు 15 రంగాలకు సంబంధించి సభ్యులు పలు సమస్యల్ని ప్రస్తావించారు. సమావేశాలకు నిర్ధిష్ట ఎజెండా లేనందున ఈ సమస్య ఎదురయ్యిందని మంత్రి గ్రహించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలు ప్రాధాన్యత కలిగినవి ఆయినప్పటికీ మెరుగైన ఫలితాలు, ఆయా రంగాల వారీ లోతైన చర్యలకు ఈ విధానం అడ్డంకిగా మారిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి పలు మార్పుల్ని సూచించారు. మొదటిగా…జిల్లా యంత్రాంగం గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై చేపట్టిన చర్యల నివేదిక (Action Taken Report-ATR)ను 3 విభాగాలుగా రూపొందించాలన్నారు. అవి…పరిష్కరించిన అంశాలు, పరిశీలనలో ఉన్న అంశాలు, చర్యలకు నోచుకోని అంశాలుగా విభజించి వాటికి తగు కారణాలు తెలుపుతూ సభ్యులకు ప్రతి సమావేశానికి వారం రోజుల ముందు అందజేయాలి. దీంతో సభ్యులు చర్చించాల్సిన అంశాలను మాత్రమే తదుపరి సమావేశంలో లేవనెత్తే అవకాశముంటుంది. తత్ఫలితంగా సమీక్షా సమావేశాల సమయం మరింత సద్వినియోగమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రెండో మార్పు ఏంటంటే…ప్రతి డిఆర్సి సమావేశంలో రెండు రంగాలతో కూడిన ఎజెండాను ప్రతిపాదించాలి. ఒక సమావేశం వ్యవసాయం, పర్యాటక రంగంపై చర్చలకు పరిమితమైతే..సభ్యులు ఆ రెండు రంగాలకు చెందిన సమస్యల్ని మాత్రమే లేవనెత్తి, వాటికి కారణభూతమైన విధానాలతో పాటు అవరోధాలు, వాటి పరిష్కారాలపై క్షుణ్ణంగా చర్చిస్తారు. దీంతో ఆయా రంగాల్ని మెరుగుపరచడంపై విలువైన సలహాలు, సూచలు అందే అవకాశముంటుంది. మూడోది…జిల్లా యంత్రాంగం డిఆర్సి సమావేశాలకు 15 రోజులు ముందుగానే సభ్యల నుంచి ఎజెండాలో ఉద్దేశించిన సబ్జెక్టులకు సంబంధించి లేవనెత్తదలచిన అంశాల్ని సేకరించి, వాటిపై పూర్తిగా మదింపుచేసి అదుపరి సమావేశాలను మరింత అర్ధవంతంగా నిర్వహించాలి. ఈ సంస్కరణల ఆధారంగా తదుపరి డిఆర్సి సమావేశాల్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశాను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు నేటి సమావేశాన్ని…గత చరిత్ర, పర్యాటక ప్రాశస్త్యాలను ప్రచారం చేసే ఉద్దేశంతో విజయవాడ సమీపంలోని కొండపల్లి ఖిల్లాలో నిర్వహించారు.
Prajavartha Online Telugu News