మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యమే మహాభాగ్యం, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం తెల్లవారుజామునే జిల్లా కలెక్టర్ ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్ వాకర్స్ అసోసియేషన్ హాల్లో యోగ గురువు చింతయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొని సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే యోగా చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా మనస్సు, శరీరము ఏకమై ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతిరోజు తాను యోగా చేయడం వలన ఎంత ఒత్తిడి ఉన్న సాఫీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. వచ్చే జూన్ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వీలుగా ప్రతి ఒక్కరు తమ పేర్లను యోగా యాప్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యంగా ఉద్యోగులు ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు యోగ సాధన ఎంతగానో తోడ్పడుతుందన్నారు . ఏపీ యోగ సభ వారు ఎక్కడా లేనివిధంగా మచిలీపట్నంలో ఐదు కేంద్రాల్లో చింతగుంటపాలెం, గొడుగుపేట, శంకరమఠం, గాంధీనగర్, రెడ్ క్రాస్ భవనంలో ఉచితంగా యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని, ప్రజలందరూ ముఖ్యంగా ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News