-అబ్బరాజుపాలెం గ్రామసభలో APCRDA కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అబ్బరాజుపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ హాజరయ్యారు.
రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ గ్రామసభలో స్పష్టం చేశారు. గ్రామస్తులు పలు సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగా.. ప్రాధాన్యత క్రమంలో, ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామకంఠాలతో పాటు ఆయా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) అమలులో భాగంగా అబ్బరాజుపాలెం గ్రామానికి సంబంధించి ఇల్లు, స్థలాలు కోల్పోయేవారికి అందజేసే లేఅవుట్లను త్వరితగతిన సిద్ధం చేయాలని కమిషనర్ గారు, CRDA ప్లానింగ్ విభాగ అధికారులను గ్రామసభలో ఆదేశించారు. అలాగే రాజధాని గ్రామాలలో రహదారుల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ పేర్కొన్నారు.
రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఎస్.భాగ్యరేఖ, పి.మధుసూధనరావు, తహసీల్దార్లు పి. సతీష్, జి.మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News