– రాజకీయాలకు అతీతంగా భోజరాజపురం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించిన మంత్రి
– ఐదు దశాబ్దాలగా తమ గ్రామానికి రహదారి లేదంటూ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు
– రహదారిని నిర్మించిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని శపథం చేసిన మంత్రి కొండపల్లి
– శపథం మేరకు హామీని నెరవేర్చి నేడు రోడ్డును ప్రారంభించిన మంత్రి
– దశాబ్దాల కళను నెరవేర్చిన మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం పలికిన భోజరాజపురం గ్రామస్తులు
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో భోజరాజపురం గ్రామస్తుల దశాబ్దాల కలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నెరవేర్చారు. గత ఐదు దశాబ్దాలకు పైగా ఈ గ్రామానికి రాహదారి సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గ్రామంలో 250 మందికి పైగా జనాభా ఉంటారు. చిన్న గ్రామం కదా ? ఇక్కడ అభివృద్ధి చేస్తే ఎంత… చేయకపోతే ఎంత ? అన్న నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఏళ్ల నుంచి ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు అందరూ గ్రామంపై పూర్తిగా శీతకన్ను వేశారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ గ్రామానికి రావడం రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం, శంకుస్థాపన చేయడం… రహదారి కలగానే మిగిలిపోవడం ఆనవాయితీగా వస్తోంది. గత సాధారణ ఎన్నికలకు ముందు సైతం గ్రామస్తులు తమకు రహదారి సౌకర్యం ఐదు దశాబ్దాలుగా లేదంటూ.. పోలింగ్ బహిష్కరిస్తామని చెప్పి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. చివరికి నాడు ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపల్లి సైతం తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. నేడు ఆ మాటను నిలబెట్టుకుంటూ రు. 2 కోట్లతో ఈ రహదారి నిర్మాణం పూర్తిచేసి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. కొండపల్లి గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఈ రహదారి సమస్య పెట్టడంతో పాటు పదే పదే ఫాలోప్ చేస్తూ పట్టువదలని విక్రమార్కుడిలా రహదారి నిర్మాణం పూర్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా మంత్రి ఈ పని చేయడం పట్ల గ్రామంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రహదారి నిర్మించిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని శపథం చేసిన మంత్రి ఈ రోజు రహదారి ప్రారంభోత్సవానికి వెళ్లగా గ్రామస్తులు మేళతాళాలతో భారీగా స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఐదు దశాబ్దాల తమ కలను మంత్రి శ్రీనివాసుడు నెరవేర్చారని.. ఇలాంటి పట్టుదల ఉన్న నాయకుడిని ఇన్నేళ్లలో తాము ఎప్పుడూ చూడలేదంటూ గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. 50 ఏళ్లుగా రహదారి లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు, ఆవేదన చూశాకే ఈ గ్రామానికి రహదారి నిర్మించాలని నిర్ణయించుకున్నానని.. ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టకుని భోజరాజపురానికి రోడ్డు వేయించడం సంతృప్తిగా ఉందని మంత్రి కొండపల్లి తెలిపారు.
Prajavartha Online Telugu News