-కడప కార్పోరేషన్ సమీక్షా సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
కడప నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కేఎంసి అదనపు కమిషనర్ రాకేష్ చంద్రంతో కలిసి ప్రజారోగ్య, పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగరంలోని పారిశుధ్య వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరంలోని పారిశుధ్య నిర్వహణ, పారిశుధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న వాహనాలు, రోజువారీ ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణ విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేరు చేయడం, పొడి వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల శుద్ధి కేంద్రాల పనితీరును సమీక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణలో గత ఏడాది నమోదైన లోపాలు, ప్రతికూల మార్కులకు కారణమైన అంశాలను విశ్లేషించి, వాటి నివారణకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. ప్రతికూల మార్కులకు కారణమైన ప్రతి అంశంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. పొడి వ్యర్థాల వినియోగం, పునర్వినియోగ ప్రక్రియలు, పరిశ్రమల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలపై కూడా అధికారులతో చర్చించారు. ప్రజారోగ్య విభాగ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన శిక్షణ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది నైపుణ్యాలను మరింత పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, వారికి అవసరమైన భద్రతా పరికరాలు, సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా చర్చించారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే నగర పరిశుభ్రతను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని, ప్రజలకు నాణ్యమైన పారిశుధ్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య, పారిశుధ్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News