-పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో రోడ్డుకు నామకరణం చేస్తాం – ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
30వ డివిజన్ దేవీనగర్ రోడ్డు కాలువ సమీపంలోని గాయక సర్వభౌముడు పారుపల్లి రామకృష్ణ పంతులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సంగీత ప్రపంచానికి అపూర్వమైన సేవలందించిన మహనీయులు పారుపల్లి రామకృష్ణ పంతులు కేవలం సంగీత విద్వాంసుడిగానే కాకుండా, ఎందరో గొప్ప కళాకారులను తీర్చిదిద్దిన ఆదర్శ గురువుగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. జీవితాంతం సంగీత బోధనకే అంకితమై, సంగీత సేవనే తన జీవిత ధ్యేయంగా భావించిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు.
ఆయన సేవలకు గుర్తింపుగానే ఈ ప్రాంతానికి రామకృష్ణపురం అనే పేరు వచ్చిందని తెలిపారు. ఆయన శిష్యులలో సంగీత దిగ్గజాలు, పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి మహనీయులు ఉండటం పారుపల్లి రామకృష్ణ పంతులు విశిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా స్థానిక పెద్దలు, అభిమానులు, శిష్యులు కోరుకున్న మేరకు గత ఏడాది స్థానిక శాసనసభ్యుడిగా ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అభిమానులు, సంగీత ప్రియులు, శిష్యులు, స్థానిక పెద్దలు కలిసి ఘనంగా నివాళులర్పించడం సంతోషకరమని అన్నారు.
స్థానిక పెద్దల విజ్ఞప్తి మేరకు పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు, ఈ రహదారికి కూడా ఆయన పేరు పెట్టేందుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కి ప్రతిపాదనలు పంపించి, త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల అభిప్రాయాలను, పెద్దల ఆకాంక్షలను గౌరవిస్తూ ముందుకు సాగడం తమ బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. “మాకు అధికారం అనేది అలంకారం కాదు… ప్రజలకు సేవ చేసే బాధ్యత” అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
చివరిగా సంగీత మహామహుడు పారుపల్లి రామకృష్ణ పంతులుకి మరోసారి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘు రామ రాజు, పద్మశ్రీ అన్నవరపు రామస్వామి, మోదుమూడి సుధాకర్, పారుపల్లి సుబ్బారావు ఫల్గుణ్, లోకనాథ శర్మ, తూములూరి కృష్ణచైతన్య, మద్దిరాల మురళీమనోహర శర్మ, పులిగడ్డ దయాకర్, ఉప్పులూరు శేషప్రసాద్ శర్మ, వీరుభొట్ల అరుణ్ కుమార్, శంకరమంచి శాయి, వడగం వెంకట రమణమూర్తి, పారుపల్లి రామకృష్ణ పంతులు ప్రియ శిష్యులు, స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంగీత కళాకారులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News