-ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం
-ఈ నెల 26న రాష్ట్ర పండుగా కోటయ్య జయంతి
-హర్షం వ్యక్తంచేసిన మంత్రి సవిత
-సీఎం చంద్రబాబుకు మంత్ర సవిత ధన్యవాదాలు
-చేనేతల్లో హర్షాతిరేకాలు
-సీఎం చంద్రబాబుకు, మంత్రులు నారా లోకేశ్ కు మంత్ర సవితకు కృతజ్ఞతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాబంధు, రాష్ట్ర చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో చేనేత రంగ పటిష్టత ప్రగడ కోటయ్య ఆది నుంచి అలుపెరగని కృషి చేశారు. స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తరవాత రాష్ట్రంలో నేతన్న జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, నూలు సరఫరాకు ఉద్యమాలు నడిపిన చరిత్ర ప్రగడ కోటయ్యది. 1950 ఏప్రిల్ 16 నుంచి జూన్ 30 వరకు కోటయ్య సత్యాగ్రహం నిర్వహించారు. పదివేల మంది చేనేత కార్మికులు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.దీంతో ఆనాటి కేంద్రప్రభుత్వం దిగి వచ్చి, ప్రగడ కోటయ్య డిమాండ్లకు అంగీకారం తెలపడంతో 75 రోజుల పాటు సాగిన సత్యగ్రహం ఉద్యమాన్ని కోటయ్య విరమించారు. నేతన్నలకు మెరుగైన జీవనం అందించడానికి కోటయ్య జైలు జీవితం సైతం అనుభవించారు. నెల్లూరు, చీరాల, రాజమండ్రిలో సహకార నూలు మిల్లుల ఏర్పాటుకు కృషి చేశారు. 200కు పైగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ్యునిగా చివరి శ్వాస వరకూ చేనేతల అభ్యున్నతికి ప్రగడ కోటయ్య శ్రమించారు. కోటయ్య సేవలను కొనియాడతూ ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి ప్రజాబంధుగా నామకరణం చేసి సత్కరించారు. 1915, జూలై 26న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన ప్రగడ కోటయ్య 1995 నవంబరు 26న తుది శ్వాస విడిచారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్దికి కృషి చేసిన ప్రగడ కోటయ్య సేవలు భవిష్యత్తరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 26న ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆ ఉత్తరుల్లో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. నేతన్నలు ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిచ్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
నేతన్నల్లో హర్షాతిరేకాలు
ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై నేతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి నాంది పలికిన ఘనత ప్రగడ కోటయ్యదేనని తెలిపారు. కోటయ్యకు కూటమి ప్రభుత్వం సరైన గుర్తింపునిచ్చిందంటూ సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తమ ఆత్మాభిమానానికి గౌరవమిస్తూ…ప్రగడ కోటయ్య జయంతి రాష్ట్ర పండుగ ఉత్తర్వులు జారీచేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News