Breaking News

పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి

-రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి
-పార్లమెంటు వర్షా కాల సమావేశాల నేపథ్యంలో జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో మాట్లాడాలని ఎంపీలకు పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.
దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో పార్టీ లోక్ సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చర్చ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *