Breaking News

కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీ

-మీ ఊరిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మీదే
-ప్రజా ప్రభుత్వానికి పేదల పక్షాన ఆలోచించే మనసు ఉంది
-2024లో రాజకీయ చెత్తను ప్రజలే శుభ్రం చేశారు
-బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగారు
-భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అసభ్య పోస్టులు సహించేది లేదు
-గుడివాడ స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-రూ.15,274 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు అన్నారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కార్బన్ న్యూట్రల్ జీవన విధానం అవలంబించాలని, ఇంటిపై పడే వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన 18వ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రూ.15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజినీరింగ్ పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ప్రజా వేదిక సమీపంలో ఆన్‌లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. మెప్మా మహిళా సంఘాలు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తులను తిలకించారు. నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉయ్యూరు, కుప్పం, నిడుదవోలు, బాపిరాజు, మదనపల్లి, విజయనగరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ, నెల్లూరు కార్పొరేషన్లకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డులు అందించిన సీఎం…ఆపరేషన్ క్లీన్ స్వీప్‌పై కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.

స్వచ్ఛ రాజకీయ లక్ష్యంతో ఎన్టీఆర్ పార్టీ స్థాపన

రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నానని, ఈసారి 18వ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గుడివాడ దివంగత ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలబడిన ప్రాంతమని గుర్తు చేశారు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే లక్ష్యాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని చెప్పారు. గతంలో స్వార్థ రాజకీయాలే ఉన్న పరిస్థితిని మార్చి అభివృద్ధి, సంక్షేమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టే లక్ష్యంగా పాలన అందిస్తోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా శాంతిభద్రతలు, సంక్షేమం, ఆదాయ వృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

పరిశుభ్రమంటే ప్రజారోగ్యం మెరుగుపడటం

‘పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు ఊడ్చడం మాత్రమే కాదని, పర్యావరణం, ప్రజారోగ్యం మెరుగు పడటమే అసలు లక్ష్యం. గత పాలనలో చెత్తతో నిండిపోయిన ప్రాంతాలను ఇప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి ఒక్కరూ తమ జన్మస్థలాన్ని చెత్త రహితంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిస్తున్నా. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తేనే స్వచ్ఛత లక్ష్యం సాధ్యం. పచ్చదనం, పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర నిర్మాణం పూర్తి అవుతంది. తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత తాను తీసుకున్నానని, పూర్తి పారదర్శకంగా సుపరిపాలన అందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోం. ప్రజా రాజధాని అమరావతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. గతంలో జన్మభూమి కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు స్పందించిన స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి ద్వారా సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం అన్నారు.

అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దతాం

ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించామని, త్వరలో మరో 1104 ఇ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.528 కోట్లతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో 8 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఇంట్లో వ్యర్థాల వర్గీకరణ ప్రారంభించాలని ప్రజలను కోరిన సీఎం, స్వచ్ఛ రథం ద్వారా వ్యర్థాల సేకరణ చేస్తూ రూ.16 కోట్ల విలువైన నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. గత పాలకులు రోడ్లపై పేరుకుపోయేలా వదిలేసిన చెత్త కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయని, వారు వదిలేసిన 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ పథం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ వంటి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.

పట్టి సీమను అడ్డుకునేందుకు ప్రయత్నించారు

‘12 ఏళ్ల క్రితం కృష్ణా డెల్టాకు నీటి ప్రవాహాలు తగ్గిపోవడంతో దేశానికి అన్నపూర్ణగా పేరొందిన ఈ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే 12 నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించాం. ఈసారి 48 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు రాకున్నా పట్టిసీమ ద్వారా డెల్టాకు నీరు అందిస్తున్నాం. ఇప్పటివరకు 450 టీఎంసీల నీటిని తరలించి దాదాపు రూ.50 వేల కోట్ల సంపదను సృష్టించాము. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. పోలవరం పూర్తయిన తర్వాత గ్రావిటీ ద్వారా డెల్టాకు నీరు అందిస్తాం. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

అక్వా, వ్యవసాయ రంగాలకు పూర్తి మద్దతు

నీరు లేకుంటే అక్వా పరిశ్రమ ఉండదని, ప్రస్తుతం రొయ్యల ధరలు, మేత ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఇప్పటికే కేంద్రంతో చర్చించామని సీఎం అన్నారు. ఈ ప్రాంత అక్వా పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడతామని, రూ.1.50 యూనిట్ చొప్పున విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కాలుష్య నియంత్రణతోనే దిగుబడి, నాణ్యత పెరుగుతుందని, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు కఠినమవుతున్న నేపథ్యంలో ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఏటా రూ.20 వేల వరకు జమ అవుతున్నాయని, పొగాకు రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ నెల 22 నుంచి తల్లికి వందనం

ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 తేదీల మధ్య “తల్లికి వందనం” పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా పేదల పక్షాన నిలిచే మనసుంది అని ఆయన అన్నారు. ఆంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పనిచేసే వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. తల్లికి వందనం కింద 67,47,197 మంది విద్యార్థులకు సంబంధించి రూ.10,122 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టం

గత పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేదని సీఎం విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు రాజకీయ చెత్తను శుభ్రం చేశారని, బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగేశారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో క్రిమినల్ ధోరణులు కొనసాగుతున్నాయని, కుట్రలు, కుతంత్రాలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై చేసిన పోస్టులను ప్రశ్నిస్తే భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సమర్థించుకోవడం సరికాదన్నారు. ప్రజల జీవితాలకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో గొర్రెల కాపరిని బైక్‌తో ఢీకొట్టి చంపిన ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకోకుండా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. గుంటూరులో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మహిళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన ఘటనపై వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను కూడా బదిలీ చేసినట్టు తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకునేందుకు వీల్లేదని, తప్పు చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరిస్తుందని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

అమరావతి, గుడివాడ బస్టాండ్ అభివృద్ధికి విరాళాలు

ఈ సమావేశంలో గుడివాడ స్థానికులు రాజధాని అమరావతితో పాటు.. గుడివాడ బస్టాండ్ అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. గుడివాడ బస్ స్టాండ్ అభివృద్ధి కోసం అన్నే నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులు రూ. 3 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. అలాగే సాయి శ్వేత అనే గృహిణి అమరావతి అభివృద్ధికి తన చేతికున్న బంగారు గాజులను విరాళంగా ప్రకటించి సీఎంకు అందించారు. ఆమె తనయుడు గణేష్ తాను దాచుకున్న కిడ్డి బ్యాంక్ డబ్బులను సీఎంకు అందించారు. అమరావతి, గుడివాడ అభివృద్ధికి విరాళాలు ఇచ్చి స్పూర్తిగా నిలిచారని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చర్చ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *