-మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి ఐటీ సేవలు, ఐటీ పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా, నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్య రహిత మరియు పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో, ప్రస్తుతం విశాఖ పోర్ట్ అథారిటీ (VPA) ద్వారా నిర్వహిస్తున్న దుమ్ము వ్యాప్తికి కారణమయ్యే బొగ్గు, ఖనిజాలు మరియు ఇతర కాలుష్య కారకాలైన బల్క్ కార్గో హ్యాండ్లింగ్ను సమీపంలోని మూలాపేట పోర్టుకు దశలవారీగా మళ్లించే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ చర్యలు మూలాపేట గ్రీన్ పీల్డ్ పోర్టు ఆఫరేషన్లు ప్రారంభించే తొలి రోజు నుంచే కార్గో హ్యాండ్లిగ్ లో కమర్షియల్ గా విజయవంతంగా పనిచేయడానికి తోడ్పడతాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి రావడం ద్వారా విశాఖ పోర్టుపై ప్రస్తుతం ఉన్న కార్గో హ్యాండ్లింగ్ ఒత్తిడి తగ్గడంతో పాటు, ఓడల టర్న్ అరౌండ్ టైమ్ మెరుగుపడి, షిప్పింగ్ సంస్థలపై పడుతున్న అదనపు ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో విశాఖ నగరంలో వాయు కాలుష్యం తగ్గి, ప్రజల జీవన నాణ్యత ప్రమాణాలు మరింత మెరుగుపడుతాయని, స్థానికంగా పారిశ్రామిక అభివృద్ఢి జరుగతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..
ఈ ప్రతిపాదనలో భాగంగా, మూలాపేట పోర్టు స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)లో 49–50 % ఈక్విటీ భాగస్వామ్యాన్ని కల్పించాలని విశాఖ పోర్ట్ అథారిటీ ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. అలాగే నామినేషన్/RoFR విధానంలో తొలి ఫేజ్ లో 2 బెర్త్లు, 2 వ ఫేజ్ లో 2 బెర్త్ లు కేటాయించాలని కోరుతుంది. SPVకి బదిలీ చేసే ఉప్పు భూములకు న్యాయమైన (Fair Value) విలువను నిర్ణయించాలని కూడా VPA ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు.
విశాఖ పోర్ట్ అథారిటీ సమర్పించిన ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి, భాగస్వామ్య విధివిధానాలను రూపొందించి, పరస్పర ఆమోదయోగ్యమైన సిఫార్సులను ప్రభుత్వం ముందుంచేందుకు… ఇప్పటికే రామాయపట్నం పోర్టుకు సంబంధించిన అంశాలపై మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ ల నేతృత్వంలో ఏర్పడిన మంత్రుల కమిటీ (GoM) ఈ అంశాన్ని కూడా పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రుల బృందానికి పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పూర్తి స్థాయిలో సహకరిస్తూ అవసరమైన సాంకేతిక మరియు పరిపాలనా అంశాలపై, తుది సిఫార్సుల రూపకల్పనకు తోడ్పాటును అందించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
Prajavartha Online Telugu News