గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో ప్రజల నుండి అందే ఫారాలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఉమెన్స్ కాలేజీ, టిజెపిఎస్ కాలేజీల్లోని పోలింగ్ కేంద్రాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రోల్ పరిశీలకులు పోలింగ్ కేంద్రాల్లో నమోదు ప్రక్రియ తీరును, బిఎల్ఓల వద్ద ఉన్న రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, స్వీకరించిన ఫారాల వివరాలను మరియు విచారణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో బిఎల్ఓలు నిర్దేశిత సమయానికి తమ పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవసరమైన ఫారాలను అందించడంతో పాటు నింపిన ఫారాలను స్వీకరించే ప్రక్రియ వేగవంతంగా జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే విచారణ అత్యంత పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఏఈఆర్ఓలు క్యాంపెయిన్ డేస్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి బిఎల్ఓ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, నిర్దేశిత రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
పర్యటనలో ఏఈఆర్ఓ సిహెచ్.కృష్ణ, డిప్యూటీ తహశీల్దార్లు నాగమల్లేశ్వరరావు, కిరణ్మై, సూపర్వైజర్స్ యూసఫ్ బేగ్, రంగారెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News