గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల భాగస్వామ్యంతో గుంటూరు నగరాన్ని స్వచ్చ గుంటూరు గా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని శుభ్రం చేసి, మొక్కలు నాటి తదుపరి ఉద్యోగులతో స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరాన్ని స్వచ్చ, గ్రీన్ నగరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు గృహాలలో ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను తడి పొడిగా శాస్త్రీయంగా వేరు చేసి ప్రజారోగ్య కార్మికులకే ఇవ్వాలన్నారు. వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లు, ఖాళీ స్థలాల్లో వేయవద్దని, అలా వేసినచో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలియచేశారు. నగర ప్రజలు తమ ఇంటి చుట్టు ప్రక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎటువంటి నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా నగర ప్రజలకు ప్లాస్టిక్ వాడుట వలన కలిగే అనర్ధాలను వివరించి, వాటిని వాడకుండా చేయాలన్నారు. ప్రస్తుతం నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పై నిషేధం ఉన్నదని, కావున ప్రజలు వ్యాపారస్తులు సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడరాదనీ తెలియచేశారు. అలాగే నగర ప్రజలు పర్యావరణం యెక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని అధికారులు సిబ్బంది కూడా తమ తమ విభాగాలలో వ్యర్ధాలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలియచేశారు.
కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, ఉపా సెల్ పిఓ సింహాచలం, ఏడిహెచ్ శాంతి, మేనేజర్ బాలాజీ బాష, నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News