హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
మహావతార్ బాబాజీ స్ఫూర్తితో నౌషిర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి అని జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు అండగా చాలా మంది పెద్దలు, యువతతోపాటు నేనెంతో ఇష్టపడే జనసైనికులు మద్దతు తెలపడం సంతోషదాయకం అని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లో తదేకం ఫౌండేషన్ పక్షాన జనరల్ సంజయ్ మిత్రా పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సాగిన ఈ భేటీలో ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సాయి సుధ, నీలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీతో కలసి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను పంచుకున్నారు. ఫౌండేషన్, జనసేన సంయుక్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసైనికులు ముందు ముందు కూడా మీరు ఇదే స్ఫూర్తిని, సేవా భావాన్ని కొనసాగిస్తూ ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలి. ఈ సేవా కార్యక్రమాలు గుంటూరు జిల్లా మాచర్లలో ప్రారంభమై తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు విస్తరించడం స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్ప్రిచ్యువల్ ఎడ్యుకేషన్ తోపాటు సేవా కార్యక్రమాలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మహా అవతార్ బాబాజీని చిరంజీవి అని చెబుతారు. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న ‘ఒక యోగి ఆత్మ కథ’ పుస్తకంతోపాటు ఆయన స్ఫూర్తితో క్రియా యోగ దీక్ష గురించి వివరించారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి మహా అవతార్ బాబా భక్తులుగానీ, శిష్యులుగానీ ఎవరో ఒకరు నన్ను కలుస్తూ ఉంటారు. అందులో భాగంగా తదేకం ఫౌండేషన్ నుంచి వీరు వచ్చి కలవడం ఆనందం వేసింది. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ పార్టీ తరఫున ఫౌండేషన్ కు అండగా నిలచిన జనసైనికులకు నా కృతజ్ఞతలు. మున్ముందు కూడా ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాలి” అన్నారు.
Prajavartha Online Telugu News