మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు ఏడవ విడత కింద మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేశారు. ఈ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాధిత సింగ్, బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని, అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద జిల్లాలో ఏడవ విడత 17,716 మంది లబ్ధిదారులకు రు.19.08 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, గత నాలుగేళ్లుగా జగనన్న తోడు పథకం కింద రుణాలు పొందిన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ రు.31.59 లక్షల రూపాయలు పంపిణీ గావించినట్లు తెలిపారు.
బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని మాట్లాడుతూ తోపుడు బండ్లు బ డ్డీ కోట్లు ద్వారా చిరు వ్యాపారాలు చేసుకుని జీవించే పేదలను రోజువారి వడ్డీల బారిన నుండి కాపాడి ప్రభుత్వం హామీగా ఉండి 10,000 రూపాయలు పైబడి బ్యాంకుల ద్వారా రుణాలు పించే కార్యక్రమం జగనన్న తోడు అన్నారు ఈ పథకం కింద వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, లబ్ధిదారులు అసలు తిరిగి చెల్లిస్తే చాలని అన్నారు. ఈ పథకం ద్వారా ఈరోజు జిల్లాలో 17,000 మందికి పైగా లబ్ధిదారులకు 19 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినట్లు తెలిపారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు
మచిలీపట్నం ముస్తా ఖాన్ పేటకు చెందిన బండి దుర్గారావు జగనన్న తోడు పథకం ద్వారా జగనన్న పదివేల రూపాయలు మా ఖాతాల్లో జమ చేశారు. ఆ సొమ్ముతో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నానని అన్నారు. తనకు వృద్ధాప్య పింఛన్, తన భార్యకు వైయస్సార్ ఆసరా పథకాలు మంజూరు చేశారని, తనకు ఒక అమ్మాయి సెకండ్ ఇంటర్ చదువుతోందని, అమ్మాయికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పొందామని, తమ కుటుంబం సంతోషంగా ఉందని, జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలు ఆర్థికంగా ఎదగటానికి తోడ్పడుతున్నాయని జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు.
మచిలీపట్నం చాకిరేవుపాలెంకు చెందిన మరో లబ్ధిదారు నజీమ తనకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప ఇంటర్ ఫస్టియర్, రెండో పాప ఎనిమిదో తరగతి చదువుతున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం, వైయస్సార్ ఆసరా పథకాలు కూడా మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటూ రుణాలు పొందుతున్నాను. జగనన్న తోడు పథకం ద్వారా పదివేల ఆర్థిక సహాయం రెండోసారి పొందుతున్నామని అన్నారు. అప్పడాలు వడియాలు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని, ప్రస్తుతం రోజుకు 500 రూపాయల వరకు వ్యాపారం చేస్తున్నామని, అందులో 200 రూపాయలు ఖర్చులు పోను, 300 రూపాయలు మిగులుతాయని దాంతో మా కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. నిరుపేదలమైన మాకు చిరు వ్యాపారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, ముఖ్యమంత్రి మా ఇబ్బందులు గుర్తించి ఎంతో మంచి పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. జగనన్న తోడు క్రింద అందించే ఆర్థిక సహాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యాపారంలో స్థిరపడేందుకు దోహదం చేస్తుందని, ఈ పథకం పొందడం నిజంగా మా అదృష్టమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, ఆర్డీవో ఐ కిషోర్, డి ఆర్ డి ఎ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు తోట నాగ మునెమ్మ పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News