-రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కేంద్ర మంత్రులను కోరారు. శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలేతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…P.M.AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110 కోట్లు విడుదల చేయాలని డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ. 245 కోట్లు, P.M.AJAY కింద డా.బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.193 కోట్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం నిధులు రూ.95.84 కోట్లు విడుదల చేయాలని కోరారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మూడు హాస్టల్స్ నిర్మించాలని, 23 ఏళ్ళు దాటిన దివ్యాంగులకు వసతి గృహాల్లో ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కేంద్ర మంత్రులను కోరారు. వీటన్నింటికి వారు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని తెలిపారు.