-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ వైద్య విద్యార్థులకు అందజేస్తున్న మాదిరిగా తమకూ స్టయిఫండ్ ఇచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఏపీ వెటర్నీరీ స్టూడెంట్స్, గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. శనివారం బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించడానికి వచ్చిన మంత్రి సవితను నగరంలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో వెటర్నరీ వైద్య విద్యార్థులు కలిసి వినతిపత్రమందజేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున స్టయిఫండ్ పెంచి ఇస్తోందన్నారు. వారి మాదిరిగానే తమకూ స్టయిఫండ్ వచ్చేలా కృషి చేయాలని, ఈ విషయం సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని వారు మంత్రిని కోరారు. అనంతరం పలు సమస్యల పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రమందజేశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో తమ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ వెటర్నరీ స్టూడెంట్స్, గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పి.నష్వర్ ఖాన్, కేవీ ధర్మతేజ, ఎం.గుణ కౌశిక్, లోకేశ్ సాయి, రమేశ్, జితేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News