-అటవీ శాఖ స్పెషల్ సిఎస్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి
అమరావతి,అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్ద ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో భాగంగా అటవీ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి మాసంతానికి సాధించిన ప్రగతి మరియు మిగిలిన రెండు మాసాల్లో అమలుపరచాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఆ శాఖ స్పెషల్ సిఎస్ జి అనంత రాము ప్రజెంటేషన్ ఇచ్చారు. శైవ క్షేత్రాలు ఎక్కువగా అటవీ ప్రాంత పరిధిలోనే ఉన్నాయని, అటవీ మార్గం ద్వారా ఆ దేవాలయాలకు వెళ్లే భక్తులను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రాగా ఈ విషయంలో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. భక్తులు ఎవరికీ ఇబ్బంది కలిగించడానికి వీలులేదని, అందుకు తగ్గట్టుగా తక్షణమే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.
కాలుష్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దేందుకు తగిన స్థాయిలో గ్రీనరీని పెంచాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని పలు నగరాలను, పట్టణాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దే విషయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తగు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా దేశంలోని పలు రాష్ట్రాలు కాలుష్య నియంత్రణకు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్లను పరిగణలోకి తీసుకొని లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలన్నారు. అటవీ ప్రాంతాల్లో కాంటూర్ ట్రెంచెలను పెద్ద ఎత్తున నిర్మించేందుకు ఎన్ ఆర్ జి ఎస్ నిధులను వినియోగించు కోవాలన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఏనుగుల బెడదను నివారించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక నుండి ఏనుగులను తీసుకొచ్చేందుకు ప్రత్యేకత చొరవ చూపుతున్నారన్నారు. ఆ ప్రక్రియను వేగవంతం చేసే అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News