-సమగ్ర శిక్షా ఏపీసీలు, సెక్టోరల్ ఆఫీసర్ల ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ముగింపు సభలో ఎస్పీడీ బి. శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ లక్ష్యం మేరకు, మానవ వనరుల శాఖా మంత్రి దిశా నిర్దేశంలో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పని చేద్దామని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమస్యలన్నీ పరిష్కరించి, 100% ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విజయవాడలో జరుగుతున్న సమగ్ర శిక్షా ఏపీసీల రాష్ట్ర సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కరించి, పాఠశాలలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సోషల్ ఆడిట్ ఎంతో కీలకమన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ సోషల్ ఆడిట్ బృందాలు తీసుకుంటున్నాయన్నారు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దగలమన్నారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన పొంది జిల్లాల్లో సక్రమంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన
మానవ వనరులశాఖా మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, భవిష్యత్తులో ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. ప్రైవేటు బడిలో చదువుతున్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపేలా ఉపాధ్యాయులు ఆకర్షణీయమైన విద్యను బోధించాలని కోరారు. మంచి విద్యను అందిస్తే మంచి సమాజాన్ని తయారు చేయగలుగుతామన్నారు.
కార్యక్రమంలో డైరెక్టర్, కోఆర్డినేషన్ పి.పార్వతి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, ఏఎస్పీడీలు ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కె.రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి, శామో అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News