-తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయడం సంతోషం
-భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది
-దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా వ్యక్తిగత అంశం
-కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే నా బలమైన ఆకాంక్ష’ అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం – ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం. సంతోషించదగిన విషయం. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి.
ఇది నా వ్యక్తిగత పర్యటన
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. రాజకీయాలకు సంబంధం లేదు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల నిమిత్తం… నా ఆరోగ్యం సైతం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చింది. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నాను. ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరాము” అని చెప్పారు.
Prajavartha Online Telugu News