మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
ఘంటసాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం సయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కిసాన్ మేళాకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంకేతిక పరిశోధనలు రైతులకు చేరువ కావాలన్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లలో నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు రైతులు అవగాహన కల్పించుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పరిజ్ఞానాన్ని రైతులు సాగులో వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాధించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ రైతులను ఉద్దేశించి అన్నారు.
కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను 2 వేల మందికి పైగా రైతులు సందర్శించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యవసాయ పనిముట్లపై అవగాహన కల్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి, విస్తరణ సంచాలకులు డా. జి. శివ నారాయణ, పరిశోధనా సంచాలకులు పీ.వీ సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త వి సత్యప్రియ లలిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్. పద్మావతి, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News