విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్వి, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈరోజు విజయనగరంలోని సంగీత మరియు నృత్య కళాశాలను సందర్శించారు.
ఈ కళాశాల దేశంలో ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉందని, పూసపాటి విజయరామ గజపతి రాజు దీన్ని ప్రారంభించారని, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మొదటి ప్రధానోపాధ్యాయుడిగా, అనంతరం ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈ బాధ్యతలను నిర్వహించారని వారు గుర్తుచేశారు. ఘంటసాల మాస్టారు, పీ. సుశీల, సాలూరు రాజేశ్వరరావు వంటి గొప్ప సంగీత విద్వాంసులు ఇక్కడ విద్యనభ్యసించారని తెలిపారు. 2019లో ఈ కళాశాల వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి నిధులు మంజూరు చేసి కళాశాల అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు.
అయితే, గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ఈ కళాశాలపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంభించిందని, ఏ చిన్న సహాయమూ అందించలేదని పొడపాటి తేజస్వి అన్నారు. నేడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.
అదే విధంగా, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ, ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు సింహాచలం చౌల్ట్రీలో భోజనం ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించారని, అయితే వైసీపీ ప్రభుత్వం గత ఏడాదిన్నరుగా ఆ విద్యార్థులకు భోజనం కూడా లేకుండా చేసిందని అన్నారు. నేడు, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్వి స్వయంగా కళాశాల సందర్శించడం, ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.
అంతేకాకుండా, పొడపాటి తేజస్వి మహారాజా సంస్కృత కళాశాలను కూడా సందర్శించి, అక్కడి విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాల వసతులను మెరుగుపరిచే దిశగా చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. సంస్కృత విద్యాభివృద్ధికి ప్రభుత్వ మద్దతుతో మరింత ప్రోత్సాహం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News