-వరాలు కురిపించిన సీఎం చంద్రబాబు
-గ్రాట్యూటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్…ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు లబ్ధి
-జీతం చెల్లింపుతో పాటు 180 రోజుల ప్రసూతి సెలవుకు అంగీకారం
-పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు
-ఆరోగ్య శాఖ సమీక్షలో కీలక నిర్ణయాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-రాష్ట్రంలోని 42,752 మంది ఆశా వర్కర్లకు చేకూరనున్న లబ్ధి
-సిఎం నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన మంత్రి సత్యకుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆశా వర్కర్లకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. వారు ఎప్పటినుంచో కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు,ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య వారధులుగా నిలిచ ఆశాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పచ్చజెండా ఊపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 37,017 మందికి, పట్టణ ప్రాంతంలో పని చేసే 5,735 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం ఆమోదముద్ర వేశారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలనే దానిపై వివిధ రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లకు అందజేస్తున్న వేతనాలు, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు, తదితరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నిర్ణయంపట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. సిఎం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమనీ , వైద్య ఆరోగ్య రంగంపై ఆయనకున్న చిత్తశుద్ధికిది నిదర్శనమనీ మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు
గ్రాట్యూటీ అమలుతో భారీ లబ్ధి
ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. 30 ఏళ్ల పాటు సేవల్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్తకు గ్రాట్యూటీ కింద రూ.1.50 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. గ్రాట్యూటీ అమలు చేయాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వారి డిమాండ్ను పరిగణలోకి తీసుకుని అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా గ్రాట్యూటీ చెల్లింపు మరే రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అమల్లో లేదు.
180 రోజుల ప్రసూతి సెలవులూ పనిదినాలే
ఆశా వర్కర్లకు గతంలో ప్రసూతి సెలవుల సమయంలో వేతన చెల్లింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు రెండు కాన్పులకు సంబంధించి సుమారు 180 రోజుల ప్రసూతి సెలువులను పని దినాలుగా పరిగణలోకి తీసుకుని వేతనం చెల్లింపునకు సీఎం అంగీకరించారు. అంటే ఈ నిర్ణయం ద్వారా 6 నెలల పాటు ప్రసూతి సెలవుల్లో ఉన్నప్పటికీ ఈ జీతం అందుతుంది. ప్రసూతి సెలవులు పొందిన వారు రూ.60 వేల మేర ప్రయోజనం పొందుతారు.
అత్యధిక జీతం ఇస్తున్న ఏకైక రాష్ట్రం
2019కి ముందు కూడా ఆశా వర్కర్లను చంద్రబాబు ఆదుకున్నారు. 2018లో పనిరిత్యా వారికి అవసరమైన స్మార్ట్ ఫోన్లను అందించడం, ఏఎన్మ్ల నియామకంలో అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడం వంటి ప్రయోజనాలను కల్పించారు. ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య పెన్షన్కు కూడా అర్హత కల్పించారు. ఈ తరహా సేవలు అందిస్తూ ఐదు రకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి ఉత్తరప్రదేశ్లో రూ.750, హిమాచల్ప్రదేశ్లో రూ.2,000, రాజస్థాన్లోరూ.2,700, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో రూ.3,000, హర్యానా, కర్ణాటకలో రూ.4,000 కేరళలో రూ.5,000, సిక్కింలో రూ.6,000, తెలంగాణలో రూ.7,500 చొప్పున నెలవారీ వేతనం అందిస్తున్నాయి. ఆశాలకు ఏపీ ప్రభుత్వం నెలకు రూ.10,000 చొప్పున జీతం చెల్లిస్తోంది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్యధికం.
Prajavartha Online Telugu News