-నీటి సరఫరాలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం
-అన్ని బోర్లు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం
-మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో నీటిసరఫరాపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి
-పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎక్కడా కూడా మంచినీటి సమస్య తలెత్తకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు మున్సిపాల్టీలు, నగరాల్లో మంచినీటి సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన పట్టణ ప్రాంతాల్లో వేసవిలో మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకుంటున్నచర్యల గురించి వివరించారు. రాష్ట్రంలోని మొత్తం 123 యూఎల్బీల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే మూడు రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తున్నామని అక్కడ కూడా పరిస్థితి మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని అన్ని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నీళ్లతో నింపుతున్నామని, ఎక్కడైనా మంచినీటి సమస్యలు తలెత్తితే అవసరమైన చోట్ల అద్దె వాహనాల ద్వారా కూడా నీళ్లు సరఫరా చేస్తామన్నారు. వేసవిలో ఎక్కడా కూడా పట్టణ ప్రాంత ప్రజలకు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. యుఎల్బీ స్థాయిలో వాటర్ సప్లే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పురమిత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చామని ప్రజలు తమకు ఎక్కడైనా మంచినీటి సమస్యలు తలెత్తితే అక్కడ ఆ సమస్య తక్షణం పరిష్కించేలా ఏర్పాట్లు చేశామని, క్షేత్రస్థాయిలో ఆ విధంగా యంత్రాంగం పనిచేసేలా జిల్లా కలెక్టర్లు సహకరించాలన్నారు. 2028కల్లా పట్టణ ప్రాంతాల్లోఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు అందించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని, ఈ లక్ష్య సాధనకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రూ.17,573 కోట్ల వ్యయంతో వివిధ పథకాల రూపంలో దీనికోసం పనులు జరుగుతున్నాయని, ఈ పనులు వేగవంతం చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.
పంచాయతీల్లో నీటి సమస్య రాకుండా ఏర్పాట్లు : శశిభూషణ్
పంచాయతీల్లో కూడా మంచినీటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పంచాయతీల్లో బోరు పంపులు అన్నీ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 26 జిల్లాల్లోని పంచాయతీల్లో 1,47,188 హ్యాండ్ పంపులున్నాయని వీటిలో కేవలం 693 మాత్రమే పనిచేయడం లేదని వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేస్తున్నామని తెలిపారు.
Prajavartha Online Telugu News