-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2024–25 సంవత్సరము ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (5 రోజులే) గడువు ఉందని, పన్ను బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం దృష్ట్యా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు గారు బుధవారం మెయిన్ ఆఫీస్ లోని ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లలను పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను, నీటి పన్నులు పూర్తిగా చెల్లించాలని తెలిపారు. నెలాఖరికి సర్వర్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నందున పన్నులు వీలైనంత త్వరగా చెల్లించాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా వేసవిని దృష్టిలో ఉంచుకొని వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు, కుర్చీలు, టెంట్, త్రాగునీటి సదుపాయాన్ని, కౌంటర్ల వద్ద ఫ్యాన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లను ఉదయం 6 గంటల నుండే అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పన్ను చెల్లించడానికి వచ్చే వారికి ఏ సమస్య తలెత్తకుండా కార్యాలయ మేనేజర్ బాలాజీ బాష కౌంటర్ల వద్ద పర్యవేక్షణ చేయాలని ఆదేశించామన్నారు. కావున పన్ను చెల్లింపు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పన్ను చెల్లించి, నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
Prajavartha Online Telugu News