విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకట రంగసాయి కుమార్ శర్మ పంచాగ శ్రవణం చేశారు. రాశి ఫలాలు వివరించారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రతిఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలతో కొత్త వెలుగులు నిండాలంటూ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
వేడుకల్లో పాల్గొన్న డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సారథ్యంలో జిల్లా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి చెందాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని.. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
వేడుకల్లో భాగంగా వేద పండితులు వెంకట రంగసాయి కుమార్ శర్మతో పాటు దాములూరి అప్పయ్యశర్మ (శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పెండ్యాల), వేదాంతం అజయ్కుమార్ (శ్రీ సీతారామస్వామి దేవస్థానం, చందర్లపాడు), తూములూరి కృష్ణమూర్తి (శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, మునగచర్ల), దుర్బాకుల సాంబమూర్తి అవధాని (శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, నందిగామ)లను సత్కరించారు.
Prajavartha Online Telugu News