అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్తుపదార్థాల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరంతర పర్యవేక్షణ చర్యల్లో భాగంగా, ఎక్సైజ్ విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) టీమ్-2 బృందం పెద్దవైలు మండలం, గుతులపుట్టు గ్రామంలో చేపట్టిన దాడిలో 362 కిలోల పొడి గంజాయిను పట్టుకుంది.
విశ్వసనీయ సమాచారంతో, ఎస్టీఎఫ్ 2 కు నేతృత్వం వహిస్తున్న టి. మధుబాబు ఆధ్వర్యంలో అమరావతి నుంచి ఈ మారుమూల ప్రాంతం చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఏపీ 39 ఎంవై 2005 నంబరు గల కమాండర్ జీప్లో గంజాయి రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో వాహనం డ్రైవర్ను అరెస్టు చేశారు. గంజాయి కొనుగోలుదారు, సరఫరాదారు/ఆస్తి యజమాని ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.12.67 లక్షలుగా అంచనా వేశారు. వాహనం విలువ రూ.4 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం రూ.16.67 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ను ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. వీరు తరచూ సమీక్షలు చేయడం, సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వడం ద్వారా వ్యవస్థ మరింత చురుకుగా పనిచేసేలాచూడగలిగారు. ఈ విజయవంతమైన దాడులకు సాధారణ పరిపాలన (రాజకీయం), ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ప్రేరణగా నిలిచారు.
Prajavartha Online Telugu News