-దేశంలోనే అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేతనాల పెంపు, ప్రోత్సాహకాలు, ఇంక్రిమెంట్ల చెల్లింపు వంటి కొన్ని విషయాలపై ఆందోళనా కార్యక్రమాల్ని చేపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు( సిహెచ్వోలు) తక్షణమే వాటిని విరమించుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీ వీరపాండియన్ సూచించారు. సిహెచ్ వోల డిమాండ్లపై ఇప్పటికే రెండు స్థాయిల్లో చర్చలు జరిగాయని, వివిధ తరగతుల ఉద్యోగస్తుల సర్వీసులకు సంబందించి ప్రభుత్వ నియమ నిబంధనలు, ఆర్థిక వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని సిహెచ్ వోల డిమాండ్ల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో సిహెచ్వోలకు నెలకు 25,000 రూపాయల వేతనంతో పాటు పనితీరు ఆధారంగా మరో 15,000 రూపాయలు ప్రోత్సాహకంగా ప్రభుత్వం చెల్లిస్తోందని, ఈ విధంగా వారికి నెలకు కనిష్టంగా 30,000 రూపాయల నుంచి గరిష్టంగా 40,000 రూపాయల వరకు చెల్లిస్తున్నామని కమీషనర్ తెలిపారు. సిహెచ్వోలకు కర్నాటకలో వేతనం మరియు ప్రోత్సాహకాలు కలిపి గరిష్టంగా నెలకు 30,000 రూపాయలు, తెలంగాణాలో 29,900 రూపాయలు, కేరళలో 21,500 రూపాయలు, తమిళనాడుతో 19,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.
పనితీరును మదింపు చేసేందుకు నిర్ధారించిన 11 ప్రమాణాల ప్రాతిపదికన వివిధ మొత్తాల్లో రాష్ట్రంలోని 10,032 సిహెచ్వోలకు నెలవారీ ప్రోత్సాహక వేతనం చెల్లిస్తున్నామని కమీషనర్ వివరించారు. 18 శాతం సిహెచ్వోలకు నెలకు ప్రోత్సాహక మొత్తంగా గరిష్టంగా ప్రతిపాదించిన 15,000 రూపాయలు చెల్లిస్తున్నామని, 75 శాతం మందికి నెలకు 11,500 రూపాయలు, మిగిలిన 8 శాతం మందికి ప్రోత్సాహకం కింద ప్రతి ఒక్క సిహెచ్వోకు నెలకు 10,000 రూపాయలకు పైగానే చెల్లిస్తున్నామని….ఇది దేశంలోనే అత్యధికమని కమీషనర్ వివరించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లలో పనిచేసే సిహెచ్వోలు ఆయా గ్రామాల్లోనే నివసిస్తూ, ఉద్యోగ ఒప్పందం మేరకు పనిచేయాల్సి ఉంటుందని, సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించి గ్రామాల్లో వైద్య సేవలకు విఘాతం కల్పించడం ఉచితం కాదని కమీషనర్ వీరపాండియన్ వ్యాఖ్యానించారు.
Prajavartha Online Telugu News