-కేంద్ర రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాల లబ్దిని పొందండి..
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంఘటిత, అసంఘటిత రంగాలలోని పనిచేస్తున్న కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర ఏ 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునే విధంగా జిల్లాస్థాయిలో కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఇగ్నైట్ ప్రత్యేక సెల్లో ఏర్పాటు చేసిన కార్మిక శాఖ స్టాల్ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త సాకారం దిశగా ఔత్సాహికులను సరికొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సెల్ అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వాటికోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ తోడ్పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖలు, సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్, స్వీగ్గి, జోమోటో వంటి అన్లైన్ ప్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ`శ్రమ్ పోర్టల్ను ప్రారంభించిందన్నారు. అన్లైన్ ప్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కల్పిస్తున్న ఆరోగ్య, సంక్షేమ, ఆర్థిక (ఎక్స్ గ్రేషియా) ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్ నమోదులో కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
ఈ సందర్భంగా ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న ఎం. పావనికి యూనిక్ ఐడి కార్డును జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అందజేశారు.
స్టాల్స్ పరిశీలనలో డిఆర్వో ఎం.లక్ష్మీ నరసింహాం, ఉపకార్మిక కమీషనర్ సిహెచ్ ఆషారాణి, అసిస్టెంట్ కమీషనర్ మహేష్, అసిస్టెంట్ లాబర్ ఆఫీసర్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News