– చేనేత రంగ అభివృద్ధిలో ఆయన కృషి వెలకట్టలేనిది
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ చేనేత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీ ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ లక్ష్మీశ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం సత్యాగ్రహ ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా చేనేత కార్మికుల కోసం సహకార సంఘాలను ప్రోత్సహించడంతో పాటు వాటిని వ్యవస్థీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి, వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రగడ కోటయ్య చేసిన సేవలు విశిష్టమైనవని.. భారతదేశ చేనేత ఉద్యమ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కోటయ్య సేవలను భావి తరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News