– పట్టిసీమ నిర్మాణ సమయంలో వైసీపీ నేతలు విమర్శించారు
– చంద్రబాబు ముందు చూపుతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం
– వర్షాభావ పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి అండగా నిలుస్తోంది
– శివగంగ-బొబ్బిలి వాగు మరమ్మతు పనులకు శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపునకు, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి పట్టిసీమ ప్రత్యక్ష నిదర్శనమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని శివగంగ-బొబ్బిలివాగు డ్రెయిన్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బందరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.6.50 కోట్ల వ్యయంతో కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు పూర్తి చేశాం. ఇప్పుడు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులతో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఈ డ్రెయిన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగుకు అనుకూల వాతావరణం కల్పిస్తాం. రైతుల భాగస్వామ్యంతో పనుల్ని వేగవంతం చేస్తాం. శివగంగా బొబ్బిలి వాగు డ్రైన్ మరమ్మత్తుల వల్ల మచిలీపట్నంతో పాటుగా చల్లపల్లి, పెడన నుండి శివగంగ కు వచ్చే డ్రైన్ వాటర్ పారుదలకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఎల్ నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
12 సంవత్సరాల క్రితం పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేశారు. రక రకాలైన విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు పట్టుదలతో పట్టిసీమను పూర్తి చేశారు. ఫలితంగా కృష్ణా డెల్టా పరిధిలోని వేలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. అదే ముందు చూపు ఉన్న నాయకుడికి ఉన్న దార్శనికత అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో.. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, టిడిపి నగర అధ్యక్షులు లోగిశెట్టి వెంకటస్వామి, క్లస్టర్ ఇంచార్జులు పిప్పళ్ళ వెంకన్న, లంకె శేషగిరి, నీటి సంఘం అధ్యక్షులు తూమాటి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు తదితర కూటమి నాయకులు అధికారులు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News