విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జి డాక్టర్ గోపాల నాయక్ ఆదేశాల మేరకు నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో యాంటీ మలేరియా ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బయాలజిస్ట్ సూర్యనాయక్ ఆధ్వర్యంలో కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో విస్తృత స్థాయిలో యాంటీ లార్వా చర్యలు చేపట్టారు.
దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారే ప్రాంతాలను గుర్తించి ఫాగింగ్ నిర్వహించడంతో పాటు, సైడ్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించి నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపు డెక్కలు, జల మొక్కలు మరియు ఇతర వ్యర్థాలను తొలగించి కాలువలో నీరు నిరంతరాయంగా ప్రవహించేలా చర్యలు చేపట్టారు. కాలువ గట్లపై ఉన్న అడ్డంకులను కూడా తొలగించి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల లార్వా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున, అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు.
ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఉపయోగంలో లేని పాత్రలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, జ్వరం లేదా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజారోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరాన్ని దోమల రహితంగా ఉంచేందుకు ప్రజలందరూ నగరపాలక సంస్థతో కలిసి సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News