-సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్ నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కె.రామకృష్ణ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 54 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని, 249 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వివరించారు. అదే విధంగా మంచినీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని రామకృష్ణ ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ… ప్రభుత్వం ఇప్పటికే ఎల్ నినో సమస్యపై దృష్టి సారించిందని, ఆగస్ట్ 3 నుంచి అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య రాకుండా ఉండేలా యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం దృష్టికి రామకృష్ణ తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Prajavartha Online Telugu News