అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఛత్తీస్గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై తీవ్రవాయుగుండం కదులుతుందని, ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ – మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.వీటి ప్రభావంతో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షం పడే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం (30-07-2026)
• పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
• శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా ,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
• మర్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల మధ్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 72.4మిమీ, కృష్ణా జిల్లా కంకిపాడులో 67.2మిమీ, పెనమలూరులో 64.6మిమీ, కోనసీమ జిల్లా అయినవిల్లిలో 62.8మిమీ, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 60.4మిమీ, కోనసీమ జిల్లా పి.గన్నవరంలో 58మిమీ, ఏలూరు జిల్లా కలిదిండిలో 55.6మిమీ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 52.6మిమీ, ఏలూరు జిల్లా ముదినేపల్లిలో 52.4మిమీ, కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 50.4మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని వివరించారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు . అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్నబోట్లు వినియోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Prajavartha Online Telugu News