-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజగోపాలచారి మార్కెట్ స్థలానికి రెండు వారాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గాంధీనగర్, గొల్లపూడి బైపాస్, హెచ్.బి. కాలనీ ప్రాంతాలను సందర్శించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గాంధీనగర్లో ఇటీవల కూల్చివేసిన రాజగోపాలచారి మార్కెట్ స్థలాన్ని పరిశీలించి, ఆ స్థలం ప్రజలకు ఉపయోగపడేలా ఉండటంతో పాటు నగరపాలక సంస్థకు స్థిరమైన ఆదాయం సమకూర్చే విధంగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, అంచనాలు, కార్యాచరణతో కూడిన నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం అక్కడ ఉన్న శిథిలాలను పూర్తిగా తొలగించి, స్థలాన్ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదుపరి గొల్లపూడి బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ట్రైన్ బాక్స్ కల్వర్టు పనులను పరిశీలించి, పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం హెచ్.బి. కాలనీలోని అన్నా క్యాంటీన్ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్లో పారిశుధ్య నిర్వహణ, సమయపాలన, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ప్రజల అభిప్రాయాలను సేకరించి, వారి సూచనలకు అనుగుణంగా సేవల్లో అవసరమైన మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి. హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News