-100 పడకల ఆసుపత్రితో సమగ్ర వైద్య సేవలు.. 2028లో ప్రారంభo
-స్థలాన్ని పరిశీలించి ఓకే చెప్పిన కేంద్ర బృందం.. మూడు నెలల్లో మౌలిక వసతులు పూర్తి:
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం(గుంటూరు దగ్గర్లో) లో 15.03 ఎకరాల్లో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్ఐవైఎన్) ఏర్పాటు కానుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక బృందం మంగళవారం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, ఆమోదం తెలిపిందన్నారు. మూడు నెలల్లో స్థల అభివృద్ధి, రహదారి, కాలువ తదితర మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. ఈ సంస్థ కార్యకలాపాలు 2028 లో ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని *సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సీసీఆర్వైఎన్)* ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ *సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (సీఆర్ఐవైఎన్)* దేశంలో యోగా, ప్రకృతి వైద్య రంగంలో అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ఒకటని మంత్రి తెలిపారు. యోగా, ప్రకృతి వైద్య విధానాలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం, వాటి ప్రభావాన్ని నిర్ధారించడం, వైద్యులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం, ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని వివరించారు.
100 పడకల ప్రత్యేక ఆసుపత్రి
సంస్థ ప్రాంగణంలోనే 100 పడకల యోగా–ప్రకృతి వైద్య ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు యోగా, ప్రకృతి వైద్యంతో సమగ్ర చికిత్స అందించడంతో పాటు పరిశోధన, చికిత్స, శిక్షణ సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు. అత్యాధునిక పరిశోధనా ప్రయోగశాలలు, ప్రత్యేక చికిత్సా విభాగాలు, శిక్షణా కేంద్రాలు, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటవుతాయని చెప్పారు.
ఇప్పటికే…
దేశంలో ఇప్పటికే హర్యానాలోని జజ్జర్, కర్ణాటకలోని నాగమంగళ, అస్సాంలోని డిబ్రూగఢ్ ప్రాంతాల్లో ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయని, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, ఒడిశాలోని జట్నీలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ ఏర్పాటైతే యోగా, ప్రకృతి వైద్య రంగాల్లో పరిశోధన, వైద్య సేవలు, శిక్షణకు రాష్ట్రం జాతీయ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదుగుతుందన్నారు.
నడింపాలెంలోని ప్రతిపాదిత స్థలం సంస్థ ఏర్పాటుకు పూర్తిగా అనుకూలమని కేంద్ర బృందం నిర్ధారించిందని మంత్రి తెలిపారు. దీంతో మూడు నెలల్లో స్థలాన్ని చదును చేయడం, రహదారి నిర్మాణం, వర్షపు నీటి కాలువ ఏర్పాటు తదితర మౌలిక వసతుల పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పారు.
స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
ప్రతిపాదిత స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, రాష్ట్ర ఆయుష్ శాఖ సంచాలకులు గోపాలకృష్ణ రోణంకి, కేంద్ర యోగా–ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ జ్యోతి కేస్వానీ, కేంద్ర ఆయుష్ శాఖ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ ప్రమోద్ వర్మ, పరిశోధన అధికారి డాక్టర్ ఎన్.వి. జ్ఞానదీప్ తాటవర్తితో కలిసి పరిశీలించారు. స్థలం సరిహద్దుల వెంట వర్షపు నీరు ప్రవహిస్తున్నందున మూతలతో కూడిన సిమెంట్ కాలువ నిర్మించాలని నిర్ణయించారు. జాతీయ రహదారి–16 నుంచి ప్రభుత్వ భూమి మీదుగా 40 అడుగుల వెడల్పుతో ప్రత్యేక రహదారి నిర్మించాలని సూచించారు. జాతీయ రహదారి కంటే దిగువన ఉన్న ప్రాంతాలను మట్టితో నింపి చదును చేయడంతో పాటు, ప్రజా రవాణా సౌకర్యం కోసం సమీపంలో బస్స్టాప్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ రహదారి–16కు ఆనుకుని, గుంటూరు నగరానికి అత్యంత సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రధాన అనుకూలతగా అధికారులు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News