-ఇతర పనులు అప్పగించవద్దని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశం
-మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి పీహెచ్సీ ఘటనపై విచారణ
-మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలవరం జిల్లా అధికారికి ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆశా కార్యకర్తలతో ఆరోగ్యానికి సంబంధించిన పనులు మాత్రమే చేయించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో శుభ్రత పనులు, ఇతర సంబంధం లేని పనులను వారికి అప్పగించవద్దని అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ మరో మారు అధికారులకు స్పష్టం చేసింది. 2024లో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. పోలవరం జిల్లాలోని మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో శుభ్రత పనులు చేయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై స్పందించి మంత్రి సత్య కుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు పోలవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని విచారణ జరపాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆశా కార్యకర్తలకు శుభ్రత పనులు ఎవరు అప్పగించారు, ఏ పరిస్థితుల్లో ఆ పనులు చేయించారు, గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు కాలేదనే విషయాలను విచారణలో తేల్చాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పూర్తిస్థాయి నివేదికను మూడు రోజుల్లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపాలని పోలవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి
స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News