చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణా వాహనాల భద్రతా ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి బుధవారం గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ పరిధిలో మచిలీపట్నం–చల్లపల్లి జాతీయ రహదారి (ఎన్హెచ్–216)లోని జీలగలగండి వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో వాహనాలకు నిర్వహిస్తున్న ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాహనాల బ్రేకింగ్ వ్యవస్థ, సస్పెన్షన్, హెడ్లైట్ల పనితీరు, స్టీరింగ్, కాలుష్య ఉద్గారాలు తదితర భద్రతా ప్రమాణాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎలా పరీక్షిస్తున్నారో అధికారులు కలెక్టర్కు వివరించారు.
వాహనాల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, మానవ జోక్యం లేకుండా నిర్వహించడం ద్వారా రహదారి భద్రతను మరింత మెరుగుపరచడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ కేంద్రాలు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరీక్షల ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల నాణ్యత, సేవల వేగం, సాంకేతిక ప్రమాణాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. రవాణా శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా వాహనాల ఫిట్నెస్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు, సాంకేతిక సిబ్బంది తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News