– పీఎండీఎస్ విధానంతో పంటలకు స్థిరత్వం
– ఎల్నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోండి
– ప్రకృతి వ్యవసాయం అన్నదాతలకు వరం
– పొలం పిలుస్తోంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని తెలిపారు.
మైలవరం మండలం, మొరుసుమిల్లిలో మంగళవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ప్రస్తుతం సాగుచేస్తున్న పంటలు, ఆ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎల్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికను వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా ఎంతో కీలకమని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. పీఎండీఎస్ పంటల సాగు ద్వారా నేలలో ఉష్ణోగ్రత తగ్గి, తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంటల స్థిరత్వం పెరుగుతుందన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యాన పంటల సాగుతో పాటు పశు పోషణపైనా దృష్టిసారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రకృతి వ్యవసాయం అన్నదాతలకు వరమని.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించి, రైతులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతోందని.. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని, సమర్థవంతమైన పంటల సాగు విధానాలను అవలంబించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పీఎండీఎస్ పంటల క్షేత్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో రైతులతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి సీహెచ్ తిరుమలదేవి, వ్యవసాయ శాఖ ఏడీ ఎం.శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి కె.సంధ్యారాణి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News