– పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు శుక్రవారం విజయవాడ కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్నిజిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తనిఖీ చేశారు. తొలిరోజు పేపర్-1 ఎస్సే పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లను కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 29వ తేదీ, 30వ తేదీల్లో అయిదు రోజులు పాటు
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. తొలిరోజు మాత్రం ఉదయం సెషన్లో మాత్రమే పరీక్ష ఉందని.. మిగిలిన రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం కూడా పరీక్షలు జరుగుతాయన్నారు. విజయవాడలోని పరీక్షా కేంద్రంలో 124 మంది అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ప్రజా రవాణా సదుపాయాలను కల్పించామని.. భద్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు 91549 70454 నంబర్తో కంట్రోల్ రూమ్ కూడా సేవలందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
పరీక్షల తొలిరోజు శుక్రవారం పేపర్ – 1 (ఎస్సే)కు 120 మంది అభ్యర్థులు హాజరుకాగా నలుగురు గైర్హాజరయ్యారు.
Prajavartha Online Telugu News