మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా బాధ్యతతో పర్యవేక్షించాలని పర్యావరణం దెబ్బతినకుండా వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎమ్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో ప్రభుత్వ భూముల ఆక్రమణ జగనన్న సురక్ష తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు, ఆస్తులు ముఖ్యంగా చెరువులు కుంటలు వంటి జల వనరులు అన్యాక్రాంతం అవుతున్నట్లు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు భవనాలు దురాక్రమనకు గురైతే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసిల్దారులు తక్షణమే స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అక్రమంగా చెరువులు, కుంటలు, గనులు, మట్టి తవ్వకాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోరాదని స్పష్టం చేశారు. బాధ్యులైన వారి పైన వాల్టా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసీల్దార్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News