– అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విధానాలు, పథకాల ఫలాలు అందాలి
– అందుకే ఊరూరుకీ మోదీ గ్యారెంటీ వ్యాన్ వెళుతోంది
– కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే అంబాసిడర్లని.. అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
విజయవాడ రూరల్ మండలం, రాయనపాడులో జిల్లా అధికారయంత్రాంగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) వాహనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల 2.0, పీఎం ఆవాస్ యోజన తదితర స్టాళ్లను సందర్శించారు. అనంతరం నవభారత నిర్మాణంలో అమృతకాలం విశిష్టత, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా అందించిన సందేశాన్ని ప్రజలు తిలకించారు. పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను తెలిపే వీడియోను ప్రదర్శించారు. మేరీ కహానీ మేరీ జుబానీలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులు పథకాల ప్రయోజనంపై తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. సమాజానికి భిన్న మార్గాల్లో సేవలందించిన వారిని సత్కరించారు. ఏఎన్ఎం దుర్గాబాయి, ఆశా వీరాంజనేయమ్మ, శానిటేషన్ వర్కర్ పరమేశ్వరి, అంగన్వాడీ వర్కర్ హిమబిందు, సేంద్రియ వ్యవసాయంతో స్ఫూర్తినందిస్తున్న పువ్వాడ రమేష్, గ్రామ వాలంటీర్ స్వాతి శ్యామల, టీబీరోగులకు పౌష్టికాహారం అందిస్తూ దాతృత్వంచాటుకుంటున్న సురేష్లను సత్కరించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వివక్షకు తావులేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2047లోపు భారత్ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి విశేష కృషిచేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా నవంబర్ 15 నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతోందన్నారు. ప్రతి పేదవాని అభివృద్ధికీ అన్ని సదుపాయాలూ అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు, పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందనీ.. ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికీ ఆ పథకం చేరాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారెంటీ వ్యాన్ గ్రామగ్రామానికీ వెళుతోందన్నారు. అర్హులెవరైనా ఉంటే వారిని వెంటనే నమోదు చేయించుకొని, పథకం అందేలా చేస్తున్నట్లు వివరించారు. ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ తదితర 17 పథకాలకు సంబంధించి ఊరూరా అవగాహన కల్పించి.. పరిపూర్ణంగా పథకాల ఫలాలు అందేలా చూస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో రెండు లక్షల 55 వేల గ్రామాలకు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు చేరువవుతాయన్నారు. జీరో బ్యాలెన్స్తో పేదలకు జన్ ధన్ ఖాతాలు తెరిపించి.. వాటిని ఆధార్తో అనుసంధానిస్తే ఆ చర్యలు కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎంత మంచి ఫలితాలు ఇచ్చాయో మనం చూశామని.. ఒక్క బటన్ నొక్కితే లబ్ధిదారులందరి ఖాతాల్లోనూ సాయం మొత్తం జమయిందని వివరించారు. ఇలా గౌరవ ప్రధానమంత్రి ఏ ఒక్క పథకం ప్రారంభించినా అవన్నీ మంచి ఫలాలు ఇచ్చేవేనని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో అందరం మనవంతు కృషిచేసి.. మన పిల్లలకు అభివృద్ధి చెందిన భారత్ను అందిద్దామన్నారు. అందరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తలపెట్టిన సంకల్ప సిద్ధికి కృషిచేద్దామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గాల్లో మహిళలకు పెద్దపీట: హోంమంత్రి తానేటి వనిత
రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశానికి ప్రపంచ దేశాలలో ప్రత్యేక స్థానం లభించిందన్నారు. కేంద్రమంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖ అయిన ఆర్ధిక శాఖకు మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారని గుర్తుచేస్తూ ప్రతి మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలకు అవకాశం ఇవ్వటం ద్వారా మహిళా సాధికారత సాధనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ముందుంటున్నారని అన్నారు. కీలకమైన హోంశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి తనకు అప్పగించారన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఎన్టీఆర్ జిల్లా రూరల్ రాయనపాడులో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రం అమలు చేస్తున్న పధకాలపై అవగాహన పెంపొందించుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తానేటి వనిత సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ విజయవాడ రూరల్ రాయనపాడులో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్రను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారన్నారు.ఈ కార్యక్రమాన్ని రూరల్, అర్బన్ ల్లో ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ కు సంకల్పం చేసుకోవడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అన్నారు. ఇప్పటికే జిల్లాలోని 60 గ్రామ పంచాయతీల్లో, రెండు అర్బన్ సెంటర్ ల్లో కార్యక్రమాలు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు అర్హత ఉన్న వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని.. ఇంకనూ లబ్ధి చేకూరని వారికి ఈ యాత్ర ద్వారా ప్రజలకు పధకాల గురించి వివరిస్తారన్నారు. నారీ శక్తి, యువశక్తి, తో పాటు పేదలను పైకి తేవాలని ప్రధానమంత్రి వీటిని అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి తో 2047లోపు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అర్హులైన ప్రతి నిరుపేదకు పధకాలు అందుతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థిక వృద్ధిరేటులో మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థను తొమ్మిదో స్థానం నుంచి నాలుగో స్థానంకు తీసుకు వచ్చారని, ప్రపంచ దేశాల్లోనే భారత్ ఒక మహా శక్తి గా మారిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చార న్నారు. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ వల్ల ఇక్కడ రైతులు చాలా నష్టపోయారని కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలని కోరుతున్నానని అన్నారు.నిర్మలా సీతారామన్ కు తమ కుటుంబానికి అనుబంధం ఉందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేసి ప్రజలకు పధకాల లబ్ధి చేకూర్చాలని శాసనసభ్యులు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల మనోభావాలు వారి మాటల్లోనే…
పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న పువ్వాడ రమేష్ మాట్లాడుతూ తనకు రెండు ఎకరాల పొలంలో సాగు చేసుకుంటున్నానని ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాలలో ఏడాదికి ఆరువేల రూపాయలు, సబ్సిడీపై విత్తనాలు ఎరువుల లబ్ధి పొందుతున్నారన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన లో లబ్ధి పొందుతున్న గుళ్ళ నిర్మల మాట్లాడుతూ తన సొంత ఇంటి కల నిజం అయిందని, 1,50,000 లబ్ధి పొందానని,తాను తన కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నామన్నారు.
ఆయుష్మాన్ భారత్ లో లబ్ధి పొందుతున్న వేముల ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన రెండు కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నానని అన్నారు.
ఉజ్వల యోజనలో తనకు గ్యాస్ సిలిండర్ ,స్టవ్ పొందానని అంజలి, పోషణ అభియాన్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ధారావత్ ఉత్తేజ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా నాలుగు కోట్ల 80 లక్షలు, రెండు కోట్ల రూపాయలు, కోటి 30 లక్షల చెక్కులను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అందజేశారు.
కార్యక్రమంలో జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ డి.పురంధేశ్వరి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ ఎం.రవీంద్రబాబు, స్పెషల్ సెక్రటరీ (హౌసింగ్) మొహమ్మద్ దివాన్, జిల్లా ప్రభారీ అధికారి మోనాలిసా దాష్, ఎంపీపీ చెన్ను లక్ష్మీ ప్రసన్న, జెడ్పీటీసీ సువర్ణరాజు, రాయనపాడు గ్రామ సర్పంచ్ కాటమనేని కళ్యాణి, జాయింట్ కలెక్టర్ డా. సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, అడిషనల్ డైరెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు) వి.భావన, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News