-అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూచిపూడి నృత్యంలో 1156 ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన మోదుకూరి బాల సరస్వతిని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కూచిపూడి నృత్యంలో గత 12 సంవత్సరాలుగా శిక్షణ అభ్యసిస్తూ, అందులో ఇప్పటివరకు 1156 నృత్య ప్రదర్శనలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించడం గర్వించదగ్గ విషయమని, ఆంధ్రప్రదేశ్ బాలరత్న అవార్డు, లెజెండ్ అవార్డు, నాట్య కళా రవళి, నాట్య మయూరి, నాట్య హంస నందిని, నృత్య తరంగిణి, నాట్య అమృత్యాంజలి, నాట్య కళా హంసిక, ఆజాద్ కా అమృత్ మహోత్సవ అవార్డు, నటరాజ్ అవార్డు లాంటి ఎన్నో అవార్డులు దక్కించుకున్న బాల సరస్వతి నీ స్ఫూర్తి తీసుకొని బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని అన్నారు.
ఇలాంటి ప్రతిభావంతులైన యువతిని మన విజయవాడ నగరంలో కలిగి ఉండటం ఎంతో గర్వకారణమని మేయర్ తెలిపారు. ఆమె సాధించిన ఘనత భారతీయ సంప్రదాయ నృత్య కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందని కొనియాడారు. బాల సరస్వతిని చూసి మరెందరో యువతులు నాట్యంలో, ఇతర సృజనాత్మక రంగాల్లో ప్రోత్సాహం పొందే అవకాశముందని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ తరఫున ఆమెకు అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో మోదుకూరి బాల సరస్వతి తల్లిదండ్రులు మోదుకూరి నాగేశ్వరరావు, భానుప్రియ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News