-బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గోశాల గ్రామంలోని బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో ఆదివారం మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా హాజరై ఆశ్రమంలోని వృద్ధ మహిళలతో ఆప్యాయంగా మమేకమయ్యారు. మదర్స్ డే సందర్భంగా మంత్రి అనిత ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆశ్రమ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వారికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు పండ్లు, చీరలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ప్రతి వృద్ధ మహిళను వ్యక్తిగతంగా పలకరించిన మంత్రి, వారి ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాకతో ఆశ్రమంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, నిస్వార్థమైన ప్రేమకు నిలువుటద్దం అమ్మ అని అన్నారు.బిడ్డల ఎదుగుదల కోసం తన జీవితాన్నే ధారబోసే ప్రతి తల్లికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్న ఆమె, మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. ఆ దేవుడు కూడా మొదటి స్థానాన్ని తల్లికే ఇస్తాడన్నారు. తల్లి పడే కష్టాలు వర్ణనాతీతం అని, పిల్లలను మంచి స్థాయికి తీసుకెళ్లాలని తల్లి ఎప్పుడూ తపన పడుతుంటుందని అన్నారు.తల్లి విలువ తెలియాలని నా పిల్లలను కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చాను అని మంత్రి అనిత పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News