-వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం
-జాప్యాలకు చెక్ పెట్టేలా కొత్త విధానం అమలు…రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా వేలాది వాహనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం, ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణాశాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో, 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
రవాణాశాఖ రూపొందించిన కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Prajavartha Online Telugu News