–పెదపాడు పాఠశాలకు కొత్త భవనం
-అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు
-రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ , ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.
Prajavartha Online Telugu News