-ఎన్టీఆర్ జిల్లాలో 50 సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపుల నిర్వహణ
-పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 27 క్రీడా విభాగాల్లో ఈ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జిల్లాలోని యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్యాంపుల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News