-కాకినాడ జీజీహెచ్లో రూ.98 కోట్లతో తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సిద్ధమైన 5 అంతస్థుల భవనo
-త్వరలో ప్రారoభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర అమెరికాలోని రంగారాయ వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల ఔదార్యం, ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించిన తల్లీబిడ్డల (మాతా, శిశు) ఆరోగ్య భవనం సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. 465 పడకలతో 5 అంతస్తులతో అత్యాధునిక వసతులతో నిర్మితమైన ఈ భవనం ప్రారంభోత్సవo వచ్చేనెల 18వ తేదీ జరగబోతుందని, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారని రంగరాయ మెడికల్ కాలేజ్ అలూమిని ఆఫ్ నార్త్ అమెరికా ఎంసీహెచ్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆచంట సుబ్బరాయ చౌదరి వెల్లడించారు. ఎంసీహెచ్ భవన నిర్మాణం, ప్రారంభోత్సవం, ఇతర వివరాల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి సత్యకుమార్ యా దవ్ తో సుబ్బరాయ చౌదరి బుధవారం చర్చించారు. ఈ భవనం నిర్మాణానికి రూ.70 కోట్ల వరకు వ్యయమైంది. ఇందులో రూ.60 కోట్లను పూర్వ వైద్య విద్యార్థులు విరాళాల రూపంలో సమకూర్చారు. 1958 నుంచి 2002 మధ్య ఈ కళాశాలలో వైద్య విద్యను పూర్తిచేసిన వారిలో సుమారు 125 మంది తమ వంతు ఆర్ధిక సహకారాన్ని అందించి, 5 అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేశారు. అలాగే ఈ భవన నిర్మాణానికి మరో రూ.11 కోట్లు, పరికరాల కోసం రూ.27 కోట్లు ప్రభుత్వపరంగా సమకురాయి. ఒక ఫ్లోరులో పూర్తిగా నవజాత శిశువుల వార్డులు ఉన్నాయి. లామినర్ ఫ్లో సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ భవనంలో ఉన్నాయి. దీనివల్ల మాతృమూర్తులు, శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోనికి రాబోతున్నాయి.
Prajavartha Online Telugu News