– వేసవి క్రీడల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడా సంస్కృతి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని.. క్రీడలను ప్రతిఒక్కరూ తమ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరుగుతున్న క్రీడల శిబిరాన్ని కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. చిన్నారులతో కలిసి ఆటలాడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇటువంటి శిక్షణ శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, క్రమశిక్షణ, జట్టు భావన, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. చిన్నారులు, యువత మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా క్రీడల వైపు కూడా అడుగులు వేయాలని సూచించారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంలో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 27 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంపులు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News